ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణంపై ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కష్టపడి పంట పండించిన రైతులు కల్లాలు లేక ధాన్యం ఆరబెట్టుకునేందుకు రోడ్లెక్కుతున్నారని, ఈ నేపథ్యంలో పల్లెపల్లెనా కల్లాల నిర్మాణం చేపట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు.
45 సెంటీమీటర్ల ఎత్తు, 45 చదరపు మీటర్లు విస్తీర్ణంలో కల్లాల నిర్మాణం చేపట్టాలని, ఒక్కో ఫ్లాట్ ఫామ్ నిర్మాణానికి రూ.46,045 అవుతుందని అంచనా వేశారు. కల్లాల నిర్మాణాల ప్రతి పాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపించాలని నిర్ణయించారు. అలాగే 2020-21 ఏడాదికి గాను రాష్ట్రంలో 40 నుండి 45 లక్షల ఎకరాలలో వరిసాగు చేసే అవకాశం ఉన్నట్లు ఉప సంఘం అంచనా వేసింది. నేషనల్ రూరల్ లైవిలీ హుడ్ మిషన్ (యన్.ఆర్.ఎల్.యం) కింద వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి / దాచిపెట్టడానికి, సేంద్రియ ఎరువుల తయారీకి ప్రోత్సహం కల్పించడంతో పాటు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని, స్థానిక అవసరాల మేరకు ప్లాట్ ఫామ్ ల నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu