అన్ని పార్టీల అభ్యర్థుల ప్రకటన అనంతరం తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు తీరు మారుతోంది. అధికార పార్టీకి టఫ్ ఫైట్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక్కడి నుంచి మరో లెక్క అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జెండాలు మారుస్తుండడంతో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
తెలంగాణలో అత్యధిక నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ను పరిశీలిస్తే.. రాజకీయంగా కొన్నిచోట్ల పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఇక్కడ 24 నియోజకవర్గాలు ఉంటే.. గోషామహల్ మినహా అన్ని స్థానాలకూ అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ చార్మినార్, పఠాన్చెరువు మినహా అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకా ఐదు చోట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. చాలాచోట్ల ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది.
శివారు నియోజకవర్గాలైన శేరిలింగంపల్లి, కూకట్పల్లిని పరిశీలిస్తే కొద్ది రోజుల క్రితం వరకూ వార్ వన్ సైడే.. అదీ అధికార పార్టీ వైపే అన్నట్లుగా ఉండేది. కాంగ్రెస్ నుంచి సరైన అభ్యర్థులు కనిపించే వారు కాదు. అయితే కొందరు నేతలు పార్టీలు మారాక సీన్ మారింది. శేరిలింగంపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మొదట్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరిగింది. అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్లోకి వెళ్లారు. అలాగే.. బండి రమే్ష టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా కాంగ్రెస్లోకి జంప్ చేశారు.
ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచిన ఆయన భార్య పూజిత కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్కు పోటీ ఎదురైంది. కాంగ్రెస్ జగదీశ్వర్గౌడ్కు టికెట్ ఇచ్చింది. ఆయన స్థానికుడు కావడంతోపాటు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీరి చిన్నాన్న మల్లికార్జున్గౌడ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రెండు దశాబ్దాలుగా ప్రజాప్రతినిఽధిగా ఉన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా నియోజకవర్గంలో రెండు డివిజన్లకే పరిమితమైనప్పటికీ ఆధ్యాత్మిక, శుభకార్యాలకు హాజరవుతూ నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో శేరిలింగంపల్లిలో పోటీ రసవత్తరంగా మారింది.
అలాగే.. కూకట్పల్లి ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు నియోజకవర్గంలో ఎదురులేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు సార్లు బంపర్ మెజార్టీతో గెలిచారు. మూడో సారి కూడా ఆయనకు తిరుగులేదనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ టికెట్ బండి రమేష్కు కేటాయించడంతో ఇప్పుడు పోటీ ఎదురైనట్లుగా కనిపిస్తోంది. రమేష్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. మార్పు కావాలా.. వద్దా.. అంటూ అందరినీ కలుస్తున్నారు. గెలుపోటముల సంగతి పక్కనబెడితే.. కాంగ్రెస్ నుంచి కృష్ణారావుకు పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో కూడా పోరు తీరులో మార్పు కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE