తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించగా, అనంతరం రాష్ట్రంలో దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఈ పథకం కోసం ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ఆ నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. ఆ నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం నాడు జమ చేసింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలంలో దళితబంధును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రూ. 50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు విడుదల చేశారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ మంగళవారం నాడు జమచేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ