దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాసి పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం శాస్త్రీయ ఆధారంగా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఓమిక్రాన్, డెల్టా రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్) కంటే కనీసం 3 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తేలిందన్నారు. దేశంలో ఇప్పటికీ వివిధ ప్రాంతాలలో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయన్నారు. అందువలన స్థానికంగా మరియు జిల్లా స్థాయిలో దూరదృష్టితో డేటా విశ్లేషణ, డైనమిక్ నిర్ణయాలతో కఠినమైన మరియు సత్వర కంటైన్మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ ని కట్టడికోసం తక్షణమే వార్ రూమ్లను యాక్టివేట్ చేయాలన్నారు.
అలాగే ఒక వారం రోజులు పరీక్షల ఆధారంగా 10% కంటే ఎక్కువ పాజిటివ్ రేటు లేదా ఆసుపత్రి బెడ్ల ఆక్యుపెన్సీ 40% కంటే ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైతే నైట్ కర్ఫ్యూలు, పెద్ద పెద్ద సమావేశాలపై నిషేధం, వివాహాలు మరియు అంత్యక్రియలలో పాల్గొనే వారి సంఖ్యలను తగ్గించడం, ఆఫీసులు, పరిశ్రమల్లో సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాలో ఆంక్షలు వంటి అంశాలను పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇక నమోదైన కరోనా పాజిటివ్ కేసులను బట్టి అన్ని కొత్త కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లపై తక్షణ నోటిఫికేషన్ చేయాలని చెప్పారు. ప్రస్తుత కరోనా మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్ లో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఏర్పాటు చేసిన క్లస్టర్స్ లో పాజిటివ్ గా తేలిన నమూనాలను ఎలాంటి ఆలస్యం లేకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సకాగ్ ల్యాబ్లకు పంపాలని రాష్ట్రాలకు సూచించారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైయినట్టు తెలిపారు. అత్యధికంగా ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 213 బాధితుల్లో ఇప్పటికే 90 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ