త్వరలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జనవరి 3, శుక్రవారం నాడు పరిశీలించారు. జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలను, ఇతర పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ది పనుల పురోగతి, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు.
జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని, పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పోలీసు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.
[subscribe]