గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం నాడు జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కుమార్తె. ముందుగా మేయర్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరపున విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ ప్రతిపాదించారు. ఇక బీజేపీ తరపున ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఈ క్రమంలో చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మికి ఎక్కువమంది సభ్యుల మద్దతు తెలపడంతో ఆమె మేయర్ గా ఎన్నికయ్యారు. గత కొన్ని రోజుల ఉత్కంఠ అనంతరం జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
అలాగే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. మేయర్ ఎన్నికపై గతకొన్ని రోజులుగా పెద్దఎత్తున చర్చ జరుగుతుంది, కాగా ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి ప్రశాంతంగా ముగిసింది. మేయర్ గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నికయినట్టు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి అధికారికంగా ప్రకటించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ శ్రీలతకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ