తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్ లో పేద ప్రజల కోసం రూ.17.85 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 210 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, సహా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లకుపైగా నిధులతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం:
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా కట్టించి ఇస్తున్న ఈ ఇళ్లులు ప్రైవేట్ బిల్డర్స్ కడితే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.9714 కోట్లతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామని చెప్పారు. ఈ స్థాయిలో తెలంగాణలో తప్ప పేదలకోసం దేశంలో ఎవరూ కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వడం లేదన్నారు. కొల్లూరులో అతిపెద్ద స్థాయిలో ఒకేచోట 112 బ్లాకుల్లో 15,630 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టౌన్ షిప్ నిర్మించామని, అతిత్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.18 వేల కోట్లకు పైగా నిధులతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ కోసం హెఛ్ఎండీఏకు చెందిన రూ.100 కోట్ల విలువచేసే స్థలం కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ