గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజకీయాలు మిర్చిలాగే ఘాటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టీ దీనిపై పడింది. అందులోనూ ఆయన గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి పరిస్థితి ఏంటనేది తెలుసుకునేందుకు రాజకీయ ఔత్సాహికులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ మూడోసారి వైసీపీ జెండా ఎగరేసి హ్యాట్రిక్ కొట్టేందుకు ఏకంగా అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు లోకేశ్ను ఈసారి గెలిపించుకుని తీరాలని టీడీపీ యంత్రాంగం మొత్తం కసితో పనిచేస్తోంది. ఆయన గెలుపు కోసం ప్రత్యేక టీమ్ మంగళగిరిలో మకాం వేసినట్లు తెలుస్తోంది.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచి గెలిచారు. అయితే గతం కంటే ఈసారి స్థానికంగా లోకేశ్ కు సానుకూల వాతావరణం ఉండడంతో పాత అభ్యర్థినే మళ్లీ పోటీలో నిలిపితే గెలుపు కష్టం అవుతుందని భావించిన వైసీపీ అధిష్ఠానం ఈసారి ఆళ్లకు చాన్స్ ఇవ్వలేదు. నారా లోకేశ్ను ఓడించేందుకు అన్ని రకాలుగానూ ఆలోచించి తొలుత నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు గంజి చిరంజీవికి వైసీపీ అధిష్ఠానం కట్టబెట్టింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలకబూనారు. వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం వైయస్ షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మళ్లీ జగన్ పార్టీలో చేరారు.
గంజి చిరంజీవి అభ్యర్థిత్వాన్ని ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యతిరేకించడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి చిరంజీవిని తప్పించి.. మురుగుడు లావణ్యను బరిలో దించారు. లోకేశ్ పై పోటీకి మహిళను నిలబెట్టి వైసీపీ వ్యూహాత్మాకంగా వ్యవహరించిందనే చర్చ మొదలైంది. అందులోనూ లావణ్యది కూడా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. దీనికితోడు లోకేశ్ ను మరోసారి ఓడించాలని వైసీపీ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టిన క్రమంలో పోటీ బలంగానే ఉండనుంది. అయితే, నారా లోకేశ్ తరఫున మంగళగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు.
దీనిపై లోకేశ్ స్పందిస్తూ “మంగళగిరిలో నా తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన మంగళగిరి ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఉత్సాహం, మీ ఆశీస్సులే నా బలం. మనం చేయి చేయి కలిపి మంగళగిరిలో విజయంతో కొత్త చరిత్రను లిఖిద్దాం. దశాబ్దాల దుష్ట పాలన నుంచి మంగళగిరికి విముక్తి కల్పిద్దాం” అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. లోకేశ్ లేకపోయినా ఆయన తరఫున భారీ స్థాయిలో కూటమి కార్యకర్తలు తరలిరావడం హాట్ టాపిక్ గా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY