ఏపీకి ప్రత్యేక హోదాకోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కాగా, ప్రత్యేక హోదా అంశంపై రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, నిన్న అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెడితే అది తమ గొప్పతనం అన్నట్లు వైసీపీ బీరాలు పలికిందన్నారు. కానీ, ఆ తర్వాత కేంద్రం హోదాను అజెండా నుంచి తీసేసిందని తెలిపారు.
వైసీపీ ఎంపీలు దీనిపై కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, స్టాలిన్, మమత బెనర్జీ, కేజ్రీవాల్ కేంద్రంపై నిరంతరం పోరాడుతున్నారని గుర్తుచేశారు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని అన్నారు. జగన్పై ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని ఎంపీ తెలిపారు.
సినిమా పరిశ్రమకు సంబంధించిన టికెట్లు వ్యవహారంలో కూడా అసలు సమస్య సృష్టించింది సీఎం జగనే అని తెలిపారు. అయితే, ఆ సమస్యను పరిష్కరించినట్లు నటిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన నవరత్నాలు కూడా సరిగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. గ్రామ సచివాలయాలు కూడా పనిచేయటం లేదని, అందుకే ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ