ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పర్యవేక్షణ, నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తుండగా, హోమ్ మంత్రి సుచరిత, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం, ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటు, ఆక్సిజన్ సరఫరా వంటి అంశాలపై దాదాపు మూడుగంటల పాటుగా చర్చించింది.
సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిరోజు అధికారులతో సమీక్ష చేస్తూ, కరోనా కట్టడి కోసం చేపట్టవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో కరోనా కేసులు పెరగకుండా, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయిలో చర్చించామని తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్య పెంచండం, కోవిడ్ కేర్ సెంటర్లు పెంచడం, అలాగే రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమయ్యే మందులు, ఆక్సిజన్ సరఫరా కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలుపై చర్చించినట్టు తెలిపారు. ముఖ్యంగా కరోనా సమస్యలకు సంబంధించిన 104 కాల్ సెంటర్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ రోజు చర్చించిన పలు విషయాలను రేపు జరిగే సమీక్షలో సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. మరోవైపు ఈ సమావేశంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ