ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET అనే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఏపీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్-2022 పరీక్ష, బీ ఫార్మసీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లు జరుగుతాయని, అలాగే 11, 12వ తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 136 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
అయితే ఈ ఎగ్జామ్స్ కోసం తెలంగాణలో కూడా నాలుగు సెంటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 11 న నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామని తెలియజేశారు. ఎగ్జామినేషన్ ప్యాట్రన్, ర్యాంకింగ్ ప్యాట్రన్స్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని విద్యార్థులకు తెలిపారు. కాగా ఈ పరీక్షల ఫలితాలు ఆగస్టు 15వ తేదీ నాటికి వెలువడేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామని, ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ