ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవలే ప్రొబేషన్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచి కొత్త పీఆర్సీ పేస్కేల్ ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పే స్కేలుతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతాల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ఈ క్రమంలో ముందుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలు పెరిగిన నేపథ్యంలో రూ.768.60 కోట్లు నిధులు అదనంగా విడుదల చేయనుంది.
ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో వేరుగా విడుదలవనుంది. మరో ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం రూ. 1,995 కోట్లు విడుదల చేశామని, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సచివాలయాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ