ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో మహిళా కండక్టర్లు మాత్రమే కనిపించేవారు. ఇకపై బస్సు డ్రైవర్లుగా కూడా మహిళలు కనిపించనున్నారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి ఆర్టీసీలోనే ఉద్యోగాలు కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక కసరత్తు మొదలెట్టింది. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా హెవీ వెహికల్ డ్రైవింగ్లో ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ అనంతరం ఖాళీగా ఉన్న స్థానాల్లో ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా మహిళలను నియమించనున్నారు. ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో వీరికి శిక్షణా తరగతులు ఏర్పాటుచేయనున్నారు. శిక్షణకు అభ్యర్థులను సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులుగా ఆర్టీసీ తెలిపింది. ఈ క్రమంలో మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేసి ఉమ్మడి జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాలల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 32 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణ కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్టీసీకి చెల్లింపులు చేస్తుంది. డ్రైవింగ్లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా జారీ చేస్తారు. ఈ అభ్యర్థుల అర్హతలు మరియు నైపుణ్యాల ఆధారంగా మొదటి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులకు వారిని నియమించాలని ప్రతిపాదించబడింది. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్లాగ్ డ్రైవర్ పోస్టుల్లో నియమించేలా చర్యలు తీసుకోనున్నారు. అర్హులైన అభ్యర్థుల ఎంపికకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ