ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 12 కార్పొరేషన్లలో మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ కోసం 7,915 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.
ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల అవగా 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో నేడు 71 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన డివిజన్స్/వార్డులు మినహాయించి ఈ రోజు 2,214 డివిజన్స్/వార్డుల్లో పోలింగ్ జరుగుతుండగా, 7,549 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 48,723 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 14 వ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ