రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పరిరక్షణ బస్సు యాత్రలో పాల్గొంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బస్సు యాత్ర ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులు, అమరావతి జేఏసీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం కోసం పలువురు రైతులు, మహిళలు చంద్రబాబుకు విరాళాలు అందించారు. చంద్రబాబు బస్సు యాత్ర నేపథ్యంలో ముందస్తుగా పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర రాజమహేంద్రవరం చేరుకోనుంది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు. చంద్రబాబుకు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు తూర్పు గోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
[subscribe]