కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించగానే.. ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు సృష్టించిన విధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. సొంత పార్టీ జెండాలనే తగులబెట్టారు. అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు… ఆతర్వాత పిఠాపురం నియోజకర్గ టీడీపీ ఇన్చార్జి వర్మను పిలిచి.. చంద్రబాబు మాట్లాడడం, ఆయన మెత్తబడి పవన్ కల్యాణ్ కు మద్దతు తెలపడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ.. అప్పటికే టీడీపీ కార్యకర్తలు చేసిన రాద్దాంతంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ధర్మవరం నియోజకవర్గంలోనూ తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిశాక.. అధినాయకులు మంచి సఖ్యతతో ముందుకు సాగుతున్నారు. కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. ప్రధానంగా టికెట్లు ఇంకా ప్రకటించని స్థానాల్లో మూడు పార్టీలూ వేర్వేరుగా ప్రచారం చేస్తున్నాయి. కూటమి నుంచి ఇప్పటి వరకు వెలువడిన రెండు జాబితాల్లోనూ మొత్తం 144 సీట్లు ప్రకటించారు. అందులో టీడీపీ అభ్యర్థులే 128 మంది ఉన్నారు. ఇంకా ఆ పార్టీ ప్రకటించని స్థానాలు 16 వరకూ ఉన్నాయి. అందులో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం కూడా ఉంది. ఈ నియోజకవర్గం టికెట్ మాకు ఇవ్వాలంటే.. మాకు ఇవ్వాలని మూడు పార్టీలూ పట్టుబడుతున్నాయి. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ తమకు ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ సీటు ఏ పార్టీకి దక్కుతుందనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ నియోజకవర్గం టికెట్ టీడీపీకి కేటాయించాలని.. ఆ పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్కు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. పరిటాల సునీత తనయుడిగా, పార్టీలో పట్టున్న యువనాయకుడిగా పేరున్న శ్రీరామ్.. నియోజకవర్గ ఇన్చార్జిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు. అనూహ్యంగా కూటమి ఏర్పాటుతో ఈ సీటు ఎవరికి వస్తుందో అనే డైలమా ఏర్పడింది. దీంతో శ్రీరామ్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా తమ అభిమతాన్ని అధిష్ఠానానికి తెలిపే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు తాజాగా.. ధర్మవరం టికెట్ తమకే కేటాయించాలన్న డిమాండ్తో జనసేన నేతలు బుధవారం ధర్మవరం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీకి టికెట్ కేటాయిస్తే సహకరించబోమని జనసేన నాయకులు అంటున్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడే వారికి, జనానికి అండగా ఉండే వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన టికెట్ ఆశిస్తున్నారు. జనసేన, టీడీపీ ప్రదర్శనలతో ధర్మవరం టికెట్ పంచాయతీ హీట్ పెరిగింది. పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు రోడ్డెక్కారు. మొత్తం ఈ పరిణామాలు అన్నింటినీ పరిశీలిస్తే.. ఈ నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయించినప్పటికీ.. మిగిలిన రెండు పార్టీలూ తీవ్రమైన స్థాయిలో స్పందించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE