ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులూ మండుటెండలో మరీ ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తెలుగుదేశం కూటమి నుంచి అయితే.. ఓ పక్క చంద్రబాబునాయుడు, మరోపక్క పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇలా రాజకీయ ప్రముఖులు,కుటుంబ సభ్యులు ప్రచారంలో ఉన్నారు. పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలను లెక్కచేయకుండా ఓట్లకోసం శ్రమిస్తున్నారు. ఎండ వేడికి జనసేనాని పవన్ కల్యాణ్ కొంచెం ఫీవర్ గా ఉన్నప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం ఆపలేదు. జ్వరం తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు విశ్రాంతి నిమిత్తం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. చంద్రబాబు మాత్రం ప్రచారం సాగిస్తున్నారు. ఈరోజు కూడా గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొవ్వూరులో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత గోపాలపురంలో చంద్రబాబు పర్యటించి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు.
అయితే.. కూటమి నేతలు ఇంత శ్రమిస్తున్నప్పటికీ.., రాష్ట్రంలో ఆదరణ పెరిగిందా, తగ్గిందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసిన తర్వాత.. రాష్ట్రంలో వారికి ఇక తిరుగులేదనే రీతిలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీజేపీ కూడా వారితో పొత్తు పెట్టుకుంది. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. రెండు నెలలకు ముందు టీడీపీ-జనసేన పొత్తుతో రాష్ట్రంలో పరిస్థితి మారింది. వైసీపీ ఎదురీదక తప్పదనేలా ప్రచారం జరిగింది. వాస్తవానికి జగన్ శిబిరంలో కూడా ఓటమి భయం కనిపించింది. కీలక నేతలు పక్క చూపులు చూడడం మొదలుపెట్టారు. కొందరు టీడీపీ, జనసేన, చివరకు కాంగ్రెస్ లో కూడా చేరారు. అయితే.. బీజేపీతో పొత్తు తర్వాత కూటమిపై ప్రజల్లో అభిప్రాయం మారిందా.. అంటే అవును అన్నట్లుగానే కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అంతగా ఆదరణ లేదు. విభజన అనంతరం కాంగ్రెస్ తో పాటు, బీజేపీ పై కూడా ఏపీవాసులు అసంతృప్తితో ఉన్నారు. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. మరోవైపు.., విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అతిపెద్ద కర్మాగారాలను అమ్మేందుకు సిద్ధపడడాన్ని ఆంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం.. బీజేపీతో కలవడం ద్వారా కూటమి గ్రాఫ్ తగ్గడం మొదలైనట్లు కనిపిస్తోంది. ప్రజల అభిప్రాయాలూ మారుతుందన్న ప్రచారం జరుగుతోంది. ధరల పెరుగుదల, పన్నుల భారం, జీతాలు సకాలంలో ఇవ్వలేకపోవడం వంటి కారణాలతో ఎంతో కొంత జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడం వాస్తవం. అలాంటి తరుణంలో జనసేన-టీడీపీ కలవడంతో వ్యతిరేక ఓటు చీలకుండా కూటమికి కలిసి వస్తుందని అందరూ భావించారు.
బీజేపీ కలిసిన తర్వాత.. కూటమిపై కొందరిలో అసంతృప్తి పెరుగుతున్నట్లు, అది జగన్ కు అనుకూలంగా మారుతున్నట్లు అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోందని, వైసీపీకే ఎడ్జ్ ఉందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీతో పొత్తుకు ముందు.. ఆ తర్వాత.. రాజకీయ పరిణామాలు మారడం వాస్తవం. అవి మున్ముందు ఇంకెలా మారతాయి అనేది ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY