జవాద్ తుఫాన్ ఉత్తరాంధ్ర వైపుగా దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా కదులుతోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 200 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ప్రస్తుతం గంటకు 6 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని, ఈ రాత్రికి విశాఖ – పూరి మధ్య తీరం తాకవచ్చని తెలిపింది. రేపు మధ్యాహ్నం సమయంలో ఒడిస్సా లోని పూరి దగ్గర తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 100 కి.మీ వేగంతో ఉండొచ్చని చెప్పారు.
NDRF బృందాలు ఇప్పటికే భోగాపురం చేరుకున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ తెలియజేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాపై జవాద్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే 1,735 సహాయక బృందాలని ఏర్పాటు చేసారు. 4 ఓడలను కూడా సిద్ధం చేసింది నేవీ. మత్స్యకారులు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే స్కూల్స్ కి కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 100 కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది ఈస్ట్ కోస్ట్ రైల్వే.