పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారితో మాట్లాడారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజలు అస్వస్థతకు గురవడానికి గల కారణాలపై మంగళగిరి ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు పరిశీలన చేస్తున్నాయి. న్యూఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో కూడా అధికారులు చర్చిస్తున్నారు. ఇక ఈ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కూడా ప్రత్యేక శాస్త్రవేత్తల బృందం పరిశీలనకు వస్తుందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుంది. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సహా స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. వాంతులు, ఆకస్మికంగా కింద పడిపోవటం, నోటి వెంట నురగలు రావటం, స్పృహ కోల్పోవటం, మూర్ఛ వంటి లక్షణాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే వీరికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినా ఫలితాలు మామాలుగానే ఉన్నాయని, కారణాలు తెలియడం లేదని వైద్యులు తెలిపారు. అలాగే ఆప్రాంతంలో నీటి నాణ్యత, పాలు సహా ఇతర అంశాల పరిశీలనలో కూడా ఎలాంటి కారణాలు తేలడం లేదని అధికారులు పేర్కొన్నారు.
శనివారం నాడు ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తూ, బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి, గుంటూరు జీజీహెచ్ కు తరలించి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటిదాకా అస్వస్థతకు గురైన బాధితుల్లో 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ