మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ అని అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. అలాగే తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట సభా వేదికను ఏర్పాటు చేస్తామని, జాతి గర్వించే మహానుభావుడు పింగళి వెంకయ్య, స్వతంత్ర సమర సాయుధ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల త్యాగాలను స్మరించుకునే విధంగా సభ ప్రాంగణం ఉంటుందని తెలిపారు. ఇక మార్చి 14వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాబోయే పది రోజుల్లో సభ కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేంగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని చెప్పారు.
బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో కలసి మీడియా నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సామాన్యుడి గళం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ..గత 9 సంవత్సరాలుగా జనసేన పార్టీ చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సహనం కోల్పోకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ముందుకు వెళ్తున్నారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమాన్ని పవిత్రంగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు పార్టీ 10వ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్వహించే ఈ సభ కోసం వచ్చే జనసైనికులు, వీర మహిళలు, నాయకులకు తగు రీతిన సౌకర్యాలు కల్పించమని సూచించారు. గత ఆవిర్భావ సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఇచ్చిన పిలుపు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు తెచ్చింది. రేపటి సభలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యచరణను పవన్ కళ్యాణ్ వివరిస్తారు” అని పేర్కొన్నారు.
“పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. నివర్ తుపాను సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించి కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోమని, ఆర్ధిక సాయం చేయమని కోరినా సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం స్పందించకపోగా, రైతుల్ని మరింత కష్టపెట్టే విధంగా కాలం గడుపుకుంటూ వచ్చింది. ఆ సందర్భంలో చాలా మంది రైతులు పవన్ కళ్యాణ్ ని కలసిన సందర్భంగా పార్టీ బలోపేతం కోసం తమ ప్రాంతంలో ఓ చక్కని కార్యక్రమం చేయమని కోరారు. ఇప్పుడు సభ కోసం రైతులు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. అద్భుతంగా 34 ఎకరాల స్థలాన్ని సభా ప్రాంగణానికి అందించారు. సభా ప్రాంగణం వద్ద రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నాం. మచిలీపట్నంకి కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై సభా వేదిక ఉంటుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఇప్పటం మాదిరి ప్రభుత్వం కూలగొట్టడానికి ఇళ్లు కూడా లేవు. సభ కోసం 34 ఎకరాల భూమిని అక్కడి రైతులు ఆశీర్వదించి ఇచ్చారు” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE