ఏపీలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ)లలో సోమవారం పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా నవంబర్ 17వతేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్లలో మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ ఎన్నిక, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, ఇద్దరు వైస్ చైర్పర్సన్ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నవంబర్ 22న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు.
నవంబర్ 17న ఎన్నికల కౌంటింగ్ అనంతరం నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. అలాగే వార్డు సభ్యులుగా విజయం సాధించిన వారు ఆయా మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, ఇద్దరు వైస్ చైర్పర్సన్ లను ఎన్నుకుంటారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో నవంబర్ 18, గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికైన సభ్యులతో మరియు ఎక్స్ అఫిషియో సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ముందుగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు మేయర్, చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కారణాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా వాయిదా పడినట్టుగానే పరిగణించాలని చెప్పారు. ఇక నోటిఫికేషన్ కు అనుగుణంగా నవంబర్ 22న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడినచోట, మరుసటి రోజైన నవంబర్ 23న తిరిగి ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్లుకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ