ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “గత ఏడాది చేపట్టిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంలో అధికార పక్షం దౌర్జన్యాల మూలంగా ఎంతో మంది నిజాయితీపరులు పోటీకి దూరమైపోయారు. ఆ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడే మొదలుపెట్టడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునరాలోచన చేయాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడం సంతోషమే. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే ప్రారంభిస్తామని చెప్పడం మాత్రం అసంతృప్తినిచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఏ స్ఫూర్తినైతే జన సైనికులు, ఆడపడుచులు, నాయకులు చూపించారో అదే స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించి విజయం సాధించాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ