అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. షెడ్యూల్ అనంతరం ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో వలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఈ నెలలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు అందిస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయమే వలంటీర్లు ఇంటికే తెచ్చి అవ్వా, తాతలకు పింఛను ఇచ్చేవారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఈనెల ఇంటింటికీ పంపిణీ ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకుంటున్నారు. దీంతో ఐదో తేదీ వచ్చినప్పటికీ పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈనెలలో ఈ ఇబ్బందులకు కారణం తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదులేనని వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది.
నాయుడుపేటలో గురువారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు అందించామని.. కానీ దాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారని జగన్ అన్నారు. ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు రమేశ్తో ఈసీకీ ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. వెయ్యి ఇస్తున్న పెన్షన్ను రూ.3వేలకు పెంచామని గుర్తుచేశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చెడిపోయాయని.. దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్నారు. 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు.
అలాగే.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పింఛన్లు ఆలస్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో టీడీపీ నేతలు మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లు నుంచి వాలంటరీ వ్యవస్థ మీద చంద్రబాబు, ఆయన బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదుఇస్తే జనం తరుముతారని, తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారు… అని వెల్లడించారు. సాఫీగా సాగుతున్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సమయంలోనే ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంతో దీనికి ప్రతిపక్షమే కారణం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు చంద్రబాబు సహా.. కూటమి నేతలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసీకి ఏ ఉద్దేశంతో ఫిర్యాదు చేసినప్పటికీ .. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తెలుగుదేశం కూటమికే మైనస్గా మారినట్లు కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY