సినిమాల్లో రాజకీయాలు చూపించడం కాదు.. రాజకీయాలే సినిమాలుగా రావడం ఏపీలో ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సినిమాలన్నీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ ను మరొక పార్టీ.. మరొక సినిమా రిలీజ్ను ఇంకొక పార్టీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వ్యూహం, యాత్ర-2 తో వైరి వర్గంపైకి వైసీపీ బాణాలు సంధిస్తే.. ‘రాజధాని ఫైల్స్’ అంటూ టీడీపీ బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. వీటిలో యాత్ర-2 ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. వ్యూహం విషయంలో టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. న్యాయస్థానాల్లో నారా లోకేష్ పిటిషన్ల విచారణ అనంతరం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈనెల 23న వ్యూహం విడుదలవుతోంది. ఇప్పుడిక ‘రాజధాని ఫైల్స్‘ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంపై సెటైరిక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలువరించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ సాగుతోంది. మంగళవారం ఇరువైపులా వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంపై నిర్ణయాన్ని ధర్మాసనం వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చేలా రాజధాని ఫైల్స్ సినిమాను తీశారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ధృవపత్రాన్ని రద్దు చేయాలని కోరతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందన్నారు. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని, దీన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ… గతేడాది డిసెంబరులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ధృవపత్రాన్ని జారీ చేసిందని, సినిమాలో ఎవరినీ కించపరిచేలా సన్నివేశాలు లేవని, ఎలాంటి మధ్యంతర ఉత్తుర్వులు జారీ చేయవద్దని కోరారు. కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వశాఖ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ.. చట్టనిబంధనల మేరకే సీబీఎఫ్సీ ధృవపత్రాన్ని జారీ చేసిందన్నారు. వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు.
సినిమా.. జనాల్లోకి త్వరగా వెళ్లే మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలన్నీ వాటిపై ఫోకస్ పెట్టాయి. తమ నేత లేదా పార్టీ చరిత్రలోని ప్రధాన ఘట్టాలను సినిమా ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. సినిమాలను అడ్డుకోవడం, రిలీజ్ చేయడం ద్వారా చర్చకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికల ముందు కూడా యాత్ర సినిమా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కమ్మరాజ్యంలో కడప రెడ్లు సంచలనం అయ్యాయి. ఈ ఎన్నికల్లో వ్యూహం, రాజధాని ఫైల్స్ చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా మారాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE