మరికొద్దిరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన గులాబీ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ హవా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్.. నల్గొండ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. అటు బీజేపీ అత్యధికంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అత్యధిక స్థానాలు దక్కించుకొని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు తమ వంతు ఎంపీలను అందివ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైపోయింది. ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. పెద్ద ఎత్తున నేతలు, ఎన్నారైలు కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈక్రమంలో జల్లెడ పట్టి కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఇద్దరు సోదరులు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. అటు ముఖ్యమంత్రి సోదరులు కావడంతో.. హైకమాండ్ కూడా వారిద్దరికి టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
2019 లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. అయితే రేవంత్ రెడ్డి గెలుపు వెనుక ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి కృషి ఎంతో ఉందట. ఆయనే ఎన్నికల వేళ మల్కాజ్గిరిలో అన్నీ చేసుకున్నారట. ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారట. ఇటీవల హైకమాండ్ అప్లికేషన్లను ఆహ్వానించగా.. కొండల్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారట. అయితే ఈసారి మల్కాజ్గిరి స్థానానికి తీవ్ర పోటీ ఉంది. పెద్ద ఎత్తున సీనియర్లు, నేతలు అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆ టికెట్ను ఆశిస్తున్నారు. అయితే వారందరిని పక్కకు పెట్టి కొండల్ రెడ్డికే మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందట.
అదే సమయంలో రేవంత్ రెడ్డి మరో సోదరుడు తిరుపతి రెడ్డి కూడా లోక్ సభ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల మహబూబ్నగర్ టికెట్ కోసం పీసీసీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అటు పార్టీ హైకమాండ్ కూడా తిరుపతి రెడ్డి వైపే మొగ్గుచూపుతోందట. ఆయన నియోజకవర్గంలో చురుకుగా ఉండడంతో పాటు రేవంత్ రెడ్డి సోదరుడు కావడంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ అనుకుంటోందట. ఈక్రమంలో అటు తిరుపతి రెడ్డి కూడా నియోజకవర్గంలో స్పీడ్ పెంచేశారట. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ఇప్పటి నుంచే జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారట. మరి వారికి టికెట్ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించినట్లుగానే.. తన సోదరులను కూడా రేవంత్ రెడ్డి గెలిపించుకుంటారా? అన్నది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE