వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అనేక మంది ఎన్ఆర్ఐ నేతలు ఎదురుచూస్తున్నారు. అందులో పలువురు టీడీపీ అధినేత ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ సీటు కోసం వెనిగండ్ల రాము పేరుని ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఆయన స్థానికంగా సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. క్రిస్టియన్ కావడం, ఎస్సీలతో బంధుత్వం కలిగిన కమ్మ నేత కావడంతో ఖచ్చితంగా ప్రభావితం చేయగలరనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో అనుభవం లేకపోవడం, రాజకీయంగా ఎంతమేరకు సమన్వయం చేయగలరన్నసందేహాలుండడంతో ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించే అంశంలో టీడీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. కొడాలి నాని లాంటి నాయకుడిని ఢీకొట్టాలంటే ఆర్థికంగానే కాకుండా, అన్ని రకాలుగా బలమైన నేత ఉండాలని టీడీపీ భావిస్తోంది. దాంతో రావి వెంకటేశ్వరరావు వంటి నేతలను కొనసాగించాలా లేదా అన్నది తేల్చుకోలేకపోతోంది.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీ అధిష్టానం దృష్టిలో పడేందుకు గంపా కృష్ణ అనే ఎన్ఆర్ఐ గట్టిగానే ప్రయత్నించారు. వివిధ సేవా కార్యక్రమాలతో రెండేళ్లుగా వార్తల్లో కనిపించారు. టీడీపీ కార్యక్రమాలకు కూడా ఆర్థికంగా అండదండలు అందిస్తూ ఆశావాహుల జాబితాలో ముందుపీఠిన నిలిచారు. అయితే ఆయన ఆశించినట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని ఇవ్వడానికి టీడీపీ అధినేత నిరాకరించారు. ఇటీవలే ఆయనకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదా కట్టబెట్టారు. దాంతో సీనియర్ నాయకురాలు కోళ్ల లలిత కుమారికి మరోసారి ఎస్ కోట సీటు ఖాయమా అనే వాదన వినిపిస్తోంది. వెనిగండ్ల రాము మాదిరిగానే గంపా కృష్ణ కి సైతం టీడీపీ ఆశించిన రీతిలో నియోజకవర్గం అప్పగించకపోవడం ఆసక్తికరంగా మారింది.
చిలకలూరిపేట గానీ గుంటూరు వెస్ట్ సీటు గానీ తనకు దక్కుతుందనే ధీమాతో భాష్యం ప్రవీణ్ ఉన్నారు. ఎన్ఆర్ఐగా వచ్చి రియల్ ఎస్టేట్ తో ఎదిగిన ప్రవీణ్ టీడీపీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులు సమీకరణలో తోడ్పడుతున్నారు. అధిష్టానం వద్ద సానుకూల అభిప్రాయం సాధించారు. అయితే చిలకలూరిపేట సీటు విషయంలో ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరికలతో టీడీపీ అధిష్టానం అడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తోంది. ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది గుంటూరు వెస్ట్ వ్యవహారం కూడా ఎటూ తేల్చడం లేదు. పలువురు నేతలు వెస్ట్ సీటు కోసం క్యూలో ఉండడంతో భాష్యం ప్రవీణ్ కి పేట పెత్తనం అప్పగించాలని చూస్తున్నట్టు లీకులు వచ్చాయి. వాటితోనే ప్రత్తిపాటి ఫైర్ కావడంతో ఇప్పుడు వ్యవహారం నిలిచిపోయింది. దాంతో మరో ఎన్ఆర్ఐ నేత కూడా ఎదురుచూడాల్సి వస్తోంది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సీట్ల కోసం మరికొందరు ఎన్ఆర్ఐ నేతలు ఆశావాహులుగా ఉన్నప్పటికీ అధిష్టానాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఈసారి టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ ఆశావాహుల్లో ఎంతమంది ఆశలు పండేనో అన్నది ప్రశ్నార్థకమే. టికెట్ల కేటాయింపు విషయంలో ఆచితూచి సాగాలని భావిస్తున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్న నేపథ్యంలో ఇది కీలకాంశం కాబోతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE