ఏపీలో రాజకీయ వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు తీసుకుంటున్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం ఆరోపణల తీవ్రత పెంచింది. మరోవైపు ఎన్డీఏలో టీడీపీ చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టారు. ఇప్పుడు సీఎం జగన్ ఇలాకా పులివెందులలో కొత్త స్కెచ్తో రంగంలోకి దిగుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీకి పట్టున్న రాయలసీమ ప్రాంతంపై ఫోకస్ చేశారు. వరుసగా ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి చంద్రబాబు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ప్రాజెక్టుల సందర్శనకు నిర్ణయించారు. పదిరోజుల పాటు వరుసగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శించనున్నారు. పెన్నా నుంచి నాగావళి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ప్లాన్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ముందుగా నంద్యాల జిల్లా నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. నందికొట్కూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు.
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ను సందర్శించనున్నారు చంద్రబాబు. ఆగస్టు 2న కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటన ఖరారైంది. కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్లనున్న చంద్రబాబు స్థానిక పూలంగళ్ల సర్కిల్ వద్ద రోడ్ షో, బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజవర్గంపై వైసీపీ నాయకత్వం ప్రత్యేకంగా గురి పెట్టింది. వై నాట్ 175 నినాదంలో కుప్పంలోనూ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ భరత్ను అభ్యర్థిగా నిర్ణయించారు. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోకస్ చేశారు.
ఇక అధికార పార్టీకి కౌంటర్గా చంద్రబాబు వై నాట్ పులివెందుల అంటూ నినాదం అందుకున్నారు. లోకేశ్ యువగళం యాత్ర జిల్లాలో సక్సెస్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా పలువురు నేతలను తమ పార్టీలోకి ఆకర్షించేలా టీడీపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. జిల్లాకు చెందిన కొందరు నేతలు జనసేనతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో ఆ పార్టీని ముందుగా దెబ్బ తీయాలనేది చంద్రబాబు వ్యూహం. నెల్లూరు తరువాత ఇప్పుడు కడప, కర్నూలు పైన గురి పెట్టారు. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ పులివెందులలో చంద్రబాబు పర్యటన రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE