తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాజకీయాల్లో తలపండిన నేత. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఆ స్థాయికి రావడానికి ఎన్నో వ్యూహాలు పన్ని ఉంటారు. ప్రతిపక్ష నాయకుడి గానూ పార్టీని, నేతలను కాపాడుకోవడానికి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఉంటారు. ఆయన జాతీయ రాజకీయాల్లో నూ క్రియాశీలంగా వ్యవహరించారు. 1996లోనే వివిధ రాజకీయ పార్టీలతో కూడిన సెక్యులర్ యునైటెడ్ ఫ్రంట్ కూటమి ఏర్పాటులోనూ, దేవెగౌడ ప్రధానమంత్రి పీఠమెక్కడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత మరో టర్న్ తీసుకొని బీజేపీతో జతకట్టి మొదటి నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజపేయీ ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి తోడ్పడ్డారు.
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవడంలోనూ బాబుకు సాటి లేరు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో పాత్ర పోషించిన చంద్రబాబు ఎన్నికల్లో టీడీపీ తో పాటు, కేంద్రంలో ఎన్డీఏ కూడా అధికారం కోల్పోయింది. అప్పుడు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘మతతత్వ బీజేపీ’, నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్లో జరిగిన అల్లర్లే ఓటమికి కారణమని నిందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని చెప్పుకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకూ వెనుకాడ లేదు. తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా మొదలైన తెలుగుదేశం ప్రస్తుతం అదే కాంగ్రెస్తో ఎలా జతకడుతుందని అనేకులు భావించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చరిత్ర అలాంటిది. ఎన్టీఆర్ కాంగ్రెస్ నేతలపై దుమ్మెత్తి పోసిన తీరు, వాడిన పదజాలం ఇంకా పాతవారికి గుర్తొస్తూనే ఉంటాయి.
వాస్తవానికి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్తోనే మొదలైంది. 1978లో ఆయన కాంగ్రెస్ టికెట్పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ చేశారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం’ నినాదంతో 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ మీద ఘన విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తరువాత టీడీపీలో చేరి క్రమంగా శక్తిమంతమైన నేతగా ఎదిగారు. 1984లో చంద్రబాబుకు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశానుసారం గవర్నర్ రామ్ లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు, ఎన్టీఆర్ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు జరిగిన ఆందోళనల్లో చంద్రబాబు క్రియాశీలకంగా పాల్గొన్నారు. అదే చంద్రబాబు 1995లో ఎన్టీఆర్ను దింపేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు పర్యాయాలు, నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఇప్పుడీ గతమంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. తన వ్యూహ, ప్రతి వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లోనూ పలుమార్లు క్రియాశీలకంగా వ్యవహరించిన చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో వ్యూహకర్త పై ఆధారపడనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను లోకేశ్ స్వయంగా తమ నివాసానికి తీసుకెళ్లారు. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా పీకే పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడీ టీడీపీకి పీకే వ్యూహకర్తగా వ్యవహరించాల్సి ఉంది. చంద్రబాబు ఆసక్తి చూపకపోవడంతో పీకే వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో గెలుపు టీడీపీకి జీవన్మరణ సమస్య కావడంతో బాబు సైతం వ్యూహకర్తపై ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అదే నిజమైతే ఇద్దరు ఉద్దండుల వ్యూహాలు టీడీపీ గెలుపు తీరాన్ని చేర్చుతాయో లేదో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE