ఎన్నికలొస్తే చాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తుంటాయి. వాటిని ఎంత వరకు అమలు చేయగలం అనే అంశాన్ని కూడా పట్టించుకోకుండా ఉచితాలు ప్రకటిస్తుంటాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగబోతుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టేశాయి. జనాలను ఆకట్టుకునేందుకు ఒకరికి మించి మరొకరు మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన కూటమి జనాలకు పలు వరాలను గుప్పించింది. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
అయితే జనసేన-టీడీపీ కూటమికి ధీటుగా అటు వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెప్పుకుంటోంది. ఇప్పుడు మరోసారి జనాలను ఆకట్టుకునేందుకు పకడ్భంధీగా మేనిఫెస్టోను తయారు చేసిందట. ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నిధులను పెంచడంతో పాటు.. మరికొన్ని కొత్త హామీలను వైసీపీ ప్రకటించబోతోందట. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారట.
ముఖ్యంగా రైతులను ఆకట్టుకనేలా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వైసీపీ హామీ ఇవ్వబోతోందట. ఈ హామీ రైతులను విపరీతంగా ఆకట్టుకుంటుందని.. ఎన్నికలవేళ కీలకం కాబోతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. ఇటీవల శ్రీకాకుళం సభలో మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అదే హామీని వైసీపీ కూడా ప్రకటించబోతోందట. అలాగే మధ్యతరగతి కుటుంబాలకు తలబారంగా మారిన గ్యాస్ సిలిండర్ను రూ. 400లకే ఇస్తామని హామీ ఇవ్వబోతోందట.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి, నేస్తం, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోంది. అమ్మఒడి పథకం కింద ఇచ్చే రూ. 15 వేలను రూ. 20 వేలకు.. నేస్తం పథకం కింద ఇచ్చే రూ. 18,500లను రూ. 20 వేలకు.. రైతు భరోసా పథకం కింద ఇచ్చే నిధులను కూడా రూ. 20 వేలకు పెంచుతామని వైసీపీ హామీ ఇవ్వబోతోందట. వీటితో పాటు నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కూడా పలు ప్రత్యేక హామీలను తీసుకొస్తున్నారట. అతి త్వరలోనే ఈ మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE