ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను శుక్రవారం నాడు ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా కలిపి మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాలు కేటాయించినట్టు వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు – వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే:
- విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్
- కృష్ణా జిల్లానుంచి మొండితోక అరుణ్కుమార్, తలశిల రఘురాం
- గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హన్మంతరావు
- అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి
- తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత ఉదయ్భాస్కర్
- చిత్తూరు జిల్లా నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్
- విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు
- ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు