ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను గురువారం నాడు ప్రకటించింది. అభ్యర్థుల వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఆరు స్థానాలకు గానూ చల్లా భగీరథరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, కరీమున్నీసా లను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇందులో అనంతపురం నేత ఇక్బాల్ కు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. అలాగే ఇటీవల మరణించిన తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయులుకు అవకాశం కల్పించారు. ఇక పార్టీ సీనియర్ నేత సీ.రామచంద్రయ్యకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు, విజయవాడ నుంచి కార్పొరేటర్ మహ్మద్ కరీమున్నీసాకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గుండుమల తిప్పే స్వామి, గుమ్మిడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్ (రాజీనామా) ల యొక్క ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29, 2021 తో పూర్తి కానుంది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 25 న ఎన్నికల నోటిఫికేషన్, అలాగే మార్చి 15 వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ