దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో పాటుగా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మరియు శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభయింది. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ముందుగానే సిద్ధం చేశారు. పోలింగ్ దృష్ట్యా పార్లమెంటు వద్ద, రాష్ట్రాల శాసనసభల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము మరియు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ ప్రారంభం కాగానే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 4,809 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నిక విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదు. ఎలెక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలకు (లోక్ సభ, రాజ్యసభ) ఎన్నికైన సభ్యులు, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికైన శాసన సభ్యులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రహస్య బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగే ఈ ఓటింగ్ లో ఎలెక్టోరల్ కాలేజీ సభ్యులంతా సిబ్బంది ఇచ్చే ప్రత్యేక పెన్నుతోనే తన ఓటు వేయాల్సి ఉంటుంది. ఎంపీ ఓటు విలువ 700 కాగా, 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్ల మొత్తం విలువ 10,86,431 గా ఉంది. ఇందులో 4033 ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 5,43,231 కాగా, 776 ఎంపీల మొత్తం ఓట్ల విలువ 5,43,200 గా ఉంది.
నేడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలి రోజునే రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండగా, ఓట్ల లెక్కింపు జూలై 21వ తేదీన చేపట్టనున్నారు. ఇక జూలై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు తదుపరి దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. ఎన్డీఏ పక్షాల ఓట్లతో పాటుగా ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, ఏపీలోని వైఎస్సార్సీపీ, టీడీపీ, మహారాష్ట్రలోని శివసేన, తమిళనాడులోని అన్నాడీఎంకే, పంజాబ్ లోని ఎస్ఏడీ, యూపీలోని ఏడీఎస్, జార్ఖండ్ లోని జేఎంఎం, కర్ణాటకలోని జేడీఎస్ పాటు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపడంతో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY