పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్’ (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో సీట్ల సర్దుబాటు, ఒప్పందాల విషయంలో ఇప్పుడు ఆ ఇండియా లో ఏం జరుగుతుందో అన్నది ఆసక్తిగా మారింది. ఒకవైపు బీజేపీ, ప్రధాన మంత్రి మోదీ మరోసారి కూడా అధికారం చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. హిందూత్వ ఎజెండాయే బీజేపీ రాజకీయ ఎజెండా అనేది అందరికీ తెలిసిందే. ఈసారి ఆ ఎజెండాను మరింత విస్తృతంగా అమలు పరిచే వ్యూహాలను బీజేపీ రచిస్తోంది. ఈ క్రమంలోనే అయోధ్యలో బాల రామ ప్రాణ ప్రతిష్ఠ ను రాజకీయంగా వినియోగించుకుంటోందని ఇప్పటికే పలువురు స్వాములు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎలాగున్నా బీజేపీకి ఈ అయోధ్య అంశం రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉంది.
అలాగే.. ఇండియా కూటమిగా ఏర్పడిన తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024 లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించారు. ఆ సెమీ ఫైనల్స్ లో బీజేపీ హవానే కనిపించింది. కూటమి లో ఐక్యత లోపించింది. ఎవరినీ కలుపుకోకుండా కాంగ్రెస్ ముందుకు సాగింది. కానీ.. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్కి విజయం దక్కింది. ఆ ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ ఇండియాను మరింత పటిష్ట పరిచే పనిలో పడింది. కూటమి నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఎక్కడైనా అసంతృప్తి ఉంటే చల్లార్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే కూటమి నేతలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తామంతా కలిసి అనుసరించబోయే వ్యూహాలపై పలుమార్లు సమావేశం అయ్యారు. సీట్ల సర్ధుబాటుతో పాటు, ఎన్నికల్లో వ్యూహాత్మంగా ఎలాంటి అంశాలను అనుసరించాలంచేనే దానిపైనే కూటమి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్రంగా కూడా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా దక్షిణాదిలో బలం పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. కీలక రాష్ట్రాలను పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే, ఆయా రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకులకు అప్పగిస్తోంది.
ఇక కీలమైన సీట్ల సర్దుబాటు విషయంలో ఇండియా కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలుత ఏడు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై దాదాపుగా ఒప్పందం కుదిరింది. మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఢిల్లీ, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్ ఒక అవగాహనకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ముకుల్ వాస్నిక్, అశోక్ గెహ్లోత్లు చర్చలు ప్రారంభించారు. మహారాష్ట్రలో అయితే శివసేన (ఉద్దవ్ థాకరే), కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఒప్పందం కుదిరింది. శివసేన, కాంగ్రెస్ చెరి 20 సీట్లకు పోటీ చేయనున్నాయి. ఎన్సీపీకి 6 సీట్లు, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అగాధీకి రెండు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. బీహార్లోనూ పొత్తులు ఖరారయ్యాయి.
జనతాదళ్ (యు), ఆర్జేడీలకు చెరి 17 సీట్లు, కాంగ్రెస్కు నాలుగు, సిపిఐ(ఎంఎల్)కు రెండు, సీపీఐకు ఒక సీటు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో కూడా ఆప్కు, కాంగ్రెస్కు మధ్య సీట్ల ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్కు 3 లేదా 4 సీట్లు ఇచ్చేందుకు ఆప్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గుజరాత్, గోవాలో చెరొక సీటు, హర్యాణాలో 4 సీట్లు కేటాయించాలని ఆప్ కాంగ్రెస్ను కోరుతోంది. పంజాబ్లో కాంగ్రెస్కు ఆరు సీట్లు కేటాయించేందుకు ఆప్ సుముఖంగా ఉంది. కాంగ్రెస్, ఆప్ల మధ్య తుది చర్చలు తేలాల్సి ఉంది. అలాగే ఇంకా.. చాలా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ టాప్గేర్ లో వ్యూహారలు రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమి కాస్త వేగం పెంచాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ