కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచే బంద్ ప్రారంభించారు. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రైతులు బంద్ లో భాగంగా రైల్ రోకో నిర్వహించడంతో రైళ్లు సైతం నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు, దుకాణాలు, వ్యాపార/వాణిజ్య సంస్థలు కూడా తెరుచుకోలేదు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బంద్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. భారత్ బంద్ కు దేశంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ పలు ప్రధాన రాజకీయపార్టీలు మద్ధతు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో రైతు మద్దతుదారులు, పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు నాయకులు, ప్రజా, వ్యాపార సంఘాల నాయకులు రోడ్లపైకి చేరుకొని రైతులకు మద్ధతుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్న సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతా చర్యలను పెంచారు. సాయంత్రం ఆరుగంటల వరకు బంద్ నిర్వహిస్తామని రైతులు ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అదేవిధంగా బంద్ లో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు, పలు పార్టీల నాయకులు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ