మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మతోపాటు ఢిల్లీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ఆదివారం ప్రకటించింది. నుపూర్ శర్మ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. నవీన్ జిందాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది. దీనిపై బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదేని ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీసినా, మతపరమైన వ్యక్తులను అవమానించినా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించారు.
అయితే బీజేపీ నేతల వివాదస్పద వ్యాఖ్యలపై ఖతార్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. దోహా లోని భారత రాయబారి దీపక్ మిట్టల్కు ఆ దేశ విదేశాంగ శాఖ దీనిపై సమన్లు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరింది. అయితే వారి వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి వాటిని సమర్ధించబోదని భారత రాయబారి మిట్టల్ వివరణ ఇచ్చుకున్నారు. అలాగే ఇతర ముస్లిం దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్ వంటి దేశాలు బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
కాగా వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తదనంతర పరిణామాలలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే.యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF