కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, వినియోగదారుల డిమాండ్కు తీసుకునే చర్యలను ఈ రోజు మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. పండుగల నేపథ్యంలో పలు పథకాలను మంత్రి ప్రకటించారు. ముఖ్యంగా పండగ అడ్వాన్స్ కింద ప్రతి ఉద్యోగికి రూ.10,000 ఇవ్వనునట్టు తెలిపారు. అలాగే ఉద్యోగులకు ఎల్టిసి క్యాష్ వోచర్ పథకం ప్రవేశపెట్టారు.
ఎల్టిసి క్యాష్ వోచర్ పథకం:
ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) వోచర్ ను ఊర్లు లేదా విహారయాత్రలు వెళ్లేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగేళ్లకోసారి కేంద్రం ప్రభుత్వం అందిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రయాణాలు లేనందున ఈ వోచరును నగదు వోచర్ల రూపంలోకి మారుస్తున్నటు తెలిపారు. ఈ నగదు వోచర్లను 12 శాతం కంటే ఎక్కువ జీఎస్టీ ఉండే వస్తువుల కొనుగోలుపై ఖర్చు పెట్టాలని చెప్పారు. అదికూడా డిజిటల్ రూపంలోనే చెల్లించాలని, జీఎస్టీ ఇన్వాయిస్ను ఉద్యోగులు సమర్పించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు మార్చి 31, 2021 వరకు వాడుకోవచ్చని తెలిపారు.
పండుగ అడ్వాన్స్ స్కీమ్ కింద ఉద్యోగులకు రూ.10,000:
ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అందరికి ప్రీపెయిడ్ రూపే కార్డు రూపంలో రూ.10,000 వడ్డీ రహిత అడ్వాన్స్ను అందిస్తామని, ఈ నగదును మార్చి 31, 2021 నాటికి ఏ పండుగ కోసమైనా ఖర్చు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. పండుగ అడ్వాన్స్ స్కీమ్ కింద ఇచ్చిన రూ.10,000 వడ్డీ లేని నగదును ఉద్యోగులంతా 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu