అంతర్జాతీయ విమానాలు పునఃప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. మార్చి 27, 2022 నుండి అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముందుగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుండి భారతదేశానికి మరియు భారతదేశం నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఆ నిషేధం కొనసాగుతుందని ఫిబ్రవరి 28న డీజీసీఏ మరోసారి సర్క్యులర్ జారీ చేసింది.
కాగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీని గుర్తించిన తర్వాత మరియు వాటాదారులతో సంప్రదించిన తర్వాత మార్చి 27 అనగా సమ్మర్ షెడ్యూల్ 2022 నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ విమానాల సేవలను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అయితే మార్చి 26, 2022 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని, అలాగే ఎయిర్ బబుల్ ఏర్పాట్లు తదనుగుణంగా ఈ మేరకు మాత్రమే విస్తరించబడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. మరోవైపు అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలు ఫిబ్రవరి 10, 2022న అంతర్జాతీయ ప్రయాణాల కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని మరియు అవి ఎప్పటికప్పుడు సవరించబడతాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ