కొత్త కరోనా వైరస్ వేరియంట్ (బి.1.1.529) మళ్ళీ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెఛ్ఓ) వైరస్ ఎవల్యూషన్ యొక్క టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సలహా మేరకు, బి.1.1.529 వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కు నవంబర్ 26న “ఒమిక్రాన్” అనే పేరు పెట్టింది. ఒమిక్రాన్ లో గణనీయమైన సంఖ్యలో ఉత్పరివర్తనలు ఉన్నట్లు నివేదించబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డబ్ల్యూహెఛ్ఓ ప్రకటించింది. ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వరుసగా అనేక దేశాలకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి భారత్ కు వచ్చేవారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. రిస్క్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం కఠినమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు భారత్ కు రాగానే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని, అలాగే ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరే ముందు లేదా కనెక్టింగ్ ఫ్లైట్ కి వెళ్లే ముందు కరోనా పరీక్ష ఫలితాల కోసం వేచి ఉండవలసి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రిస్క్ దేశాలు నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరడానికి అనుమతించబడతారని, అయితే అనంతరం 14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలని సూచించారు. అయితే ఇతర దేశాల నుండి వచ్చే వారిలో కూడా ఐదు శాతం మందిని ఎయిర్ పోర్ట్లో ర్యాండమ్ గా పరీక్షించనున్నట్టు పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్త మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు.
మరోవైపు ఒమిక్రాన్ కరోనా వేరియంట్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పక్కా కంటైన్మెంట్ విధానం, యాక్టివ్ సర్వైలెన్స్, మెరుగైన టెస్టింగ్, క్లస్టర్స్ ను పర్యవేక్షణ చేయడం, కరోనా వ్యాక్సినేషన్ లో వేగం పెంచడం, పరిస్థితులను ఎదుర్కొనేలా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై కీలకంగా దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలు విదేశాల నుండి వచ్చే కరోనా పాజిటివ్ ప్రయాణికుల నుండి నమూనాలను సేకరించి జెనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (ఇన్సాకాగ్) యొక్క నిర్దేశిత ల్యాబ్లకు పంపవలసి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాల్లోని కరోనా నిఘా అధికారులు ఇన్సాకాగ్ ల్యాబ్లతో సమన్వయం చేసుకుని, కరోనా వేరియంట్ మరియు ఫార్మేషన్ కేస్ క్లస్టర్ల వ్యాప్తిని నిరోధించడానికి టెస్ట్-ట్రాక్-ట్రీట్ విధానాన్ని చేపట్టాలని సూచించారు. కాగా దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసు నమోదు కాలేదని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ