ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మరియు అస్సాం ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నార్త్-ఈస్టర్న్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ పురోగతి గురించి, అన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్లు అందించడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అలాగే ప్రజల్లో వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలు, సంకోచాలను అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలపై వారు చర్చించారు. కరోనా చికిత్స కోసం వైద్య మౌలిక సదుపాయాల మెరుగుదల, పీఎం కేర్స్ ఫండ్ ద్వారా అందించిన మద్దతు గురించి వారు మాట్లాడారు. పాజిటివిటీ రేటుతో పాటు తమ రాష్ట్రాల్లోని కేసుల సంఖ్యను తగ్గించడానికి సకాలంలో చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు బాగా కృషి చేశారని, ఈ రాష్ట్రాల్లో భూభాగం దృష్ట్యా ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలు, చికిత్స మరియు వ్యాక్సిన్ వేయడానికి మౌలిక సదుపాయాలను కల్పించారని ప్రశంసించారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరగడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో లెవెల్ లో కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడం కోసం మైక్రో కంటైన్మెంట్ ప్రోటోకాల్ వాడాలని సూచించారు.
కరోనా వైరస్ మ్యుటేషన్ పై కఠినమైన పర్యవేక్షణ మరియు అన్ని వేరియంట్లను ట్రాక్ చేయడం చేయాలని సూచించారు. సరైన జాగ్రత్తలు పాటించకుండా హిల్ స్టేషన్లలో రద్దీ ఏర్పడితే, పరిస్థితులు ఇబ్బందిగా మారతాయని, అనవసర రద్దీని నివారించాలని సూచించారు. వ్యాక్సిన్లపై వ్యతిరేకతను పోగట్టడానికి, అపోహలను పరిష్కరించడానికి సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రముఖులు మరియు మత విశ్వాస సంస్థల సహాయాన్ని తీసుకోవాలని చెప్పారు. అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రధానమైనవని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన రూ.23000 కోట్ల ప్యాకేజీ వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్పారు. అలాగే పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ