టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం, స్ఫూర్తి నింపడంలో భాగంగా ప్రధాని మోదీ వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో అథ్లెట్లతో పాటుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, కేంద్ర క్రీడా శాఖ సహాయమంత్రి నిషిత్ ప్రమాణిక్, లా మరియు జస్టిస్ శాఖ మంత్రి కిరెన్ రిజిజూ లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దీపికా కుమారి (ఆర్చరీ), నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), ద్యుతి చంద్ (స్ప్రింట్), ఆశిష్ కుమార్ (బాక్సింగ్), మేరీ కోమ్ (బాక్సింగ్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), సౌరభ్ చౌదరి (షూటింగ్), కమల్ (టేబుల్ టెన్నిస్), మణికా బాత్రా (టేబుల్ టెన్నిస్), వినేష్ ఫోగట్ (రెజ్లింగ్), సజన్ ప్రకాష్ (స్విమ్మింగ్), మన్ప్రీత్ సింగ్ (హాకీ), సానియా మీర్జా (టెన్నిస్) సహా పలువురు అథ్లెట్స్ తో ప్రధాని మోదీ సంభాషించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా ఈసారి అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వలేకపోయానని అన్నారు. ఈ మహమ్మారి అథ్లెట్ల ప్రాక్టీస్ మరియు ఒలింపిక్స్ సంవత్సరాన్ని కూడా మార్చిందని చెప్పారు. దేశం మొత్తం అండగా మీ వెనుక ఉందని, దేశప్రజలందరి ఆశీర్వాదం మీతోనే ఉందని ప్రధాని అథ్లెట్లతో అన్నారు. అథ్లెట్లందరికీ క్రమశిక్షణ, అంకితభావం మరియు సంకల్పం ఉన్నాయని అన్నారు. క్రీడాకారులలో నిబద్ధత మరియు పోటీతత్వాన్ని గుర్తించామని, అదే లక్షణాలు న్యూ ఇండియాలో కనిపిస్తాయని అన్నారు. అథ్లెట్లు కొత్త భారతదేశాన్ని ప్రతిబింబిస్తారని మరియు దేశం యొక్క భవిష్యత్తును సూచిస్తారని చెప్పారు. అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే దేశ ప్రజలను “చీర్ 4 ఇండియా” లో పాల్గొనాలని కోరారు.
మరోవైపు ఈసారి భారత్ నుంచి 18 క్రీడా విభాగాలలో మొత్తం 126 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఒలింపిక్ క్రీడోత్సవాలలో ఇప్పటివరకు భారత్ నుంచి వెళ్లిన దళాలన్నిటిలోకీ ఇదే అతి పెద్ద దళం. 18 వేరు వేరు క్రీడా విభాగాలలో మొత్తం 69 పోటీలలో భారత్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. అలాగే వివిధ ఆటలలో భారత్ తరఫున ఆటగాళ్లు మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. ఫెన్సింగ్ విభాగంలో భవానీ దేవి, సెయిలర్ గా నేత్ర కుమారన్, స్విమ్మింగ్ విభాగంలో సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్ లు భారత్ తరపున ఆయా విభాగాల్లో తొలిసారిగా పాల్గొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ