ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 27, 28 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఆగస్టు 27, శనివారం సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఖాదీ ఉత్సవ్లో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరుగుతున్న ఒక కార్యక్రమంగా స్వాతంత్య్ర పోరాటంలో ఖాదీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఖాదీ ఉత్సవ్ నిర్వహించబడుతోంది. ఈ ఖాదీ ఉత్సవ్ అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో నిర్వహించబడుతుండగా, గుజరాత్లోని వివిధ జిల్లాల నుండి 7500 మంది మహిళా ఖాదీ కళాకారులు ఒకే సమయంలో మరియు ఒకే స్థలంలో చరఖా స్పిన్నింగ్ చేయడాన్ని లైవ్ లో చూడొచ్చు. పొందూరు ఖాదీ తయారీకి సంబంధించిన లైవ్ ప్రదర్శన కూడా ఉండనుంది. ఈ సందర్భంగా గుజరాత్ రాజ్య ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు యొక్క నూతన కార్యాలయ భవనాన్ని మరియు సబర్మతిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
ఇక ఆగస్టు 28, ఆదివారం ఉదయం 10 గంటలకు భుజ్ జిల్లాలో స్మృతి వన్ మెమోరియల్ని ప్రధాని ప్రారంభిస్తారు. భుజ్లో 2001లో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 13,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ప్రజలు చూపిన ఆత్మస్థైర్యాన్ని పురస్కరించుకుని, పునరుద్ధరణ స్ఫూర్తిని జరుపుకోవడానికి స్మృతి వన్ మెమోరియల్ ను సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ మెమోరియల్ భూకంపం సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పేర్లను కలిగి ఉంది. అనంతరం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ భుజ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో భారతదేశంలో సుజుకి 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగే కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా దేశంలో సుజుకీ గ్రూప్కు చెందిన రెండు కీలక ప్రాజెక్టులు అయిన హంసల్పూర్లో సుజుకి మోటార్ గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, హర్యానాలోని ఖర్ఖోడాలో మారుతీ సుజుకీ అప్ కమింగ్ వెహికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY