ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 23, గురువారం నాడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మణిపూర్లో నీటి సరఫరా ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేయబడుతున్న ఈ నీటి సరఫరా ప్రాజెక్టు రాష్ట్రంలో నీటి సమస్యలను తగ్గిస్తుందనీ, ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు భారీ ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. గ్రేటర్ ఇంఫాల్ తో పాటుగా 25 చిన్న పట్టణాలు మరియు రాష్ట్రంలోని 1,700 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాబోయే రెండు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి తమ ఇళ్ళల్లో స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుందని, వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని పీఎం మోదీ పేర్కొన్నారు.
15 కోట్లకు పైగా గృహాలకు నేరుగా పైపుల ద్వారా నీరు సరఫరా చేసే లక్ష్యంతో గత ఏడాది జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించిన విషయాన్ని పీఎం మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఈ రోజున దేశంలో ప్రతిరోజూ ప్రజల భాగస్వామ్యంతో సుమారు ఒక లక్ష నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయబడుతున్నాయని అన్నారు. మరోవైపు దేశం యావత్తూ కోవిడ్-19 కు వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాడుతుండగా, తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలను కూడా ఎదుర్కోవలసి వచ్చిందని, ఆ ప్రభావంతో చాలా మంది ప్రాణాలను కోల్పోగా, అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. గత 6 సంవత్సరాలలో మొత్తం ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల కేటాయించినట్టు తెలిపారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్ట్ అప్స్, ఇతర శిక్షణా కార్యక్రమాల కోసం ఇప్పుడు ఈశాన్య భారతంలో అనేక సంస్థలను నిర్మిస్తున్నట్లు పీఎం చెప్పారు. క్రీడల విశ్వవిద్యాలయం, ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడంతో మణిపూర్ దేశ క్రీడా ప్రతిభకు ప్రధాన కేంద్రంగా మారనుందని పీఎం మోదీ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu