కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులను శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్-370 రద్దు తరువాత స్థానిక పరిస్థితులను పర్యవేక్షించడానికి కాంగ్రెస్, టిఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీయం, ఎన్సీపీ, ఆర్జేడీ పార్టీలకు చెందిన నేతలు శనివారం జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. వీరి పర్యటనకు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వలేదు, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ప్రజలకు అసౌకర్యానికి గురిచేయవద్దని జమ్మూ కశ్మీర్ సమాచార శాఖ అధికారులు తెలిపారు. ప్రతి పక్ష నాయకులు పర్యటించాలనుకున్న ప్రాంతాల్లో ముందుగానే 144 సెక్షన్ అమలు చేసారు.
శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, మనోజ్ ఝా, దినేష్ త్రివేది, తిరుచ్చి శివ తదితర నాయకులను జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారులు అడ్డుకుని ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఎటువంటి పర్యటనలకు అనుమతి లేదని చెప్పి తిరిగి వారిని ఢిల్లీకి పంపారు. జరిగిన ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే వుంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడికి వెళ్లిన నాయకులను ఎందుకు వెనక్కి పంపించారని విమర్శించింది. మోడీ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న విషయాలను దాచడానికి ప్రయత్నం చేస్తుందని అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
[subscribe]
[youtube_video videoid=XLcCB9IxHrc]