తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రభుత్వం వేసిన జస్టిస్ ఆరుముఘస్వామి కమిషన్ సమర్పించిన నివేదికలో పలు సంచలన వివరాలు వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ వ్యవహారంలో జయలలిత స్నేహితురాలు శశికళను విచారించాలని కమిషన్ సిఫార్సు చేసింది. జయలలిత మరణంపై విచారణ జరిపిన కమిషన్, జయలలిత ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ కెఎస్ శివకుమార్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి సి విజయభాస్కర్తో సహా వికె శశికళ, ఆమె సన్నిహితురాలు, మరో ముగ్గురిపై అభియోగాలు మోపింది.
అయితే నివేదికలో తనపై చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ బహిష్కరణకు గురైన అన్నాడీఎంకే నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ స్పందించారు. ఈ మేరకు ఆమె మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ‘అమ్మ’ చికిత్స విషయంలో తన ప్రమేయం లేదని, దీనిపై తాను ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జయలలితను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని, ఇప్పుడు ఆమె మరణాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వారి వైఖరికి ప్రజలు ఇకపై మద్దతు ఇవ్వరని శశికళ లేఖలో పేర్కొన్నారు. జయలలిత మరణంపై ఎలాంటి వివాదాలు లేవని ప్రజలు గ్రహించారని ఆమె తెలిపారు. కమిషన్ తన పరిమితులను మించిపోయిందని, ఆధారాలు లేని ఊహాజనిత ఆరోపణలు తనపై చేసిందని మండిపడ్డారు.
2012 నుండి, ‘అమ్మ’కు నాకు సరైన సత్సంబంధాలు లేవని కమిషన్ తన నివేదికలో పేర్కొందని, అలాంటి నిర్ణయానికి వారు ఎలా వచ్చారు? అని ప్రస్తావించారు. అప్పటికే మరణించిన జయలలిత వారికి చెప్పలేదని, నన్ను కూడా వారు ఆ విషయం అడగలేదని తెలిపారు. అలాంటప్పుడు అసలు ఆ సమాచారం వారికి ఎవరు అందించారు? ఇలా తప్పుడు, అసంబద్ధమైన వ్యాఖ్య చేయడం వెనుక అంతర్యమేంటి? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆరోపణలు చేశారో అర్థం చేసుకోవాలని దీనిని ప్రజలకుకే వదిలివేస్తున్నానని శశికళ అన్నారు.
అయినా తాను ‘అమ్మ’కు అందించే వైద్య చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఈ విషయంపై నా అభిప్రాయాలను తెలియజేయడానికి తానేమీ మెడిసిన్ చదవలేదని శశికళ అన్నారు. జయలలితకు ఎలాంటి మందులు ఇవ్వాలో వైద్య బృందం నిర్ణయించిందని, ప్రతి విషయాన్నీ ముందుగా ఆమెకు తెలిపాకే వైద్యులు కూడా చికిత్స అందించారని వివరించారు. ‘అమ్మ’కు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి సాధారణ ఆసుపత్రి కాదని, ఆమెకు గతంలో ఇక్కడే పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అక్కడి వైద్యులకు ఆమె పరిస్థితి గురించి తెలుసని, అందుకే ఆ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని, అక్కకు (జయలలిత) ఫస్ట్క్లాస్ ట్రీట్మెంట్ అందించడమే తన ఉద్దేశమని శశికళ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY