దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటరుకి రూ.100 దాటింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధర తగ్గించడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కీలక ప్రకటన చేసింది. పెట్రోల్పై పన్ను లీటరుకు రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఈ రోజు తమ మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గిస్తున్నామని, దీని ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.1,160 కోట్ల ఆదాయ నష్టం జరుగుతుందని తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు.
లీటరు పెట్రోల్పై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.32.90 ఎక్సైజ్ సుంకం వసూలు చేయగా, ఇప్పుడు లీటరుకు రూ.29.90కి మారనుంది. దీని ద్వారా వినియోగదారులకు నేరుగా లీటరుపై రూ.3 తగ్గనుంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 94.39 గా ఉంది. అయితే డీజిల్ ధరపై ప్రభుత్వం ఎలాంటి తగ్గింపు ప్రకటించలేదు. పెట్రోల్ పై తగ్గింపు ధర ఆగస్టు 14, శనివారం నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ ధర తగ్గిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పలువురు స్వాగతిస్తున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమిళనాడును అనుసరించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ