టీమిండియా ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా సోమవారం నాడు స్టువర్ట్ బిన్నీ ప్రకటన చేశాడు. 2014, జులైలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో బిన్నీ అంతర్జాతీయ క్రికెట్లో కి అడుగుపెట్టాడు. భారత్ తరపున బిన్నీ మొత్తం 14 వన్డేలు, 6 టెస్ట్లు, 3 టీ-20 మ్యాచుల్లో ఆడాడు. భారత్ వన్డే బృందంలో బిన్నీకి రెగ్యులర్ గా చోటుదక్కినప్పటికీ, తుది జట్టులో ఆడే అవకాశాలు పరిమితంగా లభించాయి. 2015 ప్రపంచ కప్ కు ఎంపిక అయినా కానీ ఒక మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బిన్నీ చివరిసారిగా 2016 లో వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఆడాడు. ఆ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 32 పరుగులు ఇవ్వడంతో, ఆతర్వాత జట్టుకు ఎంపికలో అతనికి అన్ని దారులు మూసుకుపోయాయి. కాగా వన్డేల్లో భారత్ తరపున బౌలింగ్ లో అత్యుత్తమ గణాంకాలు బిన్నీ పేరునే ఉన్నాయి. 2014లో ఢాకాలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో బిన్నీ కేవలం 4 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు.
మరోవైపు ఐపీఎల్లో స్టువర్ట్ బిన్నీ ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 95 ఐపీఎల్ మ్యాచుల్లో 880 పరుగులు చేయగా, 22 వికెట్లు తీశాడు. అత్యున్నత అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రిటైర్మెంట్ ప్రకటనలో బిన్నీ పేర్కొన్నాడు. తనను గుర్తించి మద్దతు అందించిన బీసీసీఐ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ప్రోత్సహించిన కోచ్లకు, తనపై విశ్వాసం ఉంచిన సెలక్టర్లకు, ఆటలో బాధ్యతలు అప్పగించిన కెప్టెన్లకు స్టువర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ