అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగంలో ఈ అవార్డును అందజేస్తున్నారు. అందులో భాగంగా జనవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు క్రికెటర్లను ఐసీసీ నామినేట్ చేసింది. ఈ ముగ్గురిలో భారత్ జట్టు నుంచి బ్యాటర్ శుభ్ మన్ గిల్, బౌలర్ మహమ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. అలాగే నామినేట్ అయిన వారిలో న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే కూడా ఉన్నాడు.
జనవరిలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో గిల్ 70, 21 మరియు 116 స్కోర్లను నమోదు చేశాడు. అనంతరం హైదరాబాద్ లో న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో 149 బంతుల్లో 208 పరుగులు చేసాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ మైలురాయిని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. న్యూజిలాండ్ తో రెండవ మరియు మూడో వన్డేల్లో 40 (నాటౌట్) మరియు 112 పరుగులు చేశాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఏడు ఓవర్లు వేసి 2/30 వికెట్లు తీశాడు. శ్రీలంకతో రెండవ, మూడో వన్డేల్లో వరుసగా 3/30 మరియు 4/32తో అద్భుత ప్రదర్శన చేసి సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
హైదరాబాద్ లో న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో 10 ఓవర్లలో 4/46, రాయ్ పూర్ లో జరిగిన రెండవ వన్డేలో 6-1-10-1తో అద్భుత ప్రదర్శన చేశాడు. సిరాజ్ ఐదు మ్యాచ్ ల ద్వారా 3.82 అద్భుతమైన ఎకానమీని కొనసాగించాడు, టాప్-ఆర్డర్ బ్యాటర్ లను నిలకడగా ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్ లో అవిష్క ఫెర్నాండో (మూడుసార్లు), కుసల్ మెండిస్ (రెండుసార్లు), డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ మరియు హెన్రీ నికోల్స్ వికెట్స్ సమర్పించుకున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్ తో సిరీస్ లలో బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జనవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినేషన్స్ లో నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE