మహారాష్ట్రలో మరోసారి రగిలిన రాజకీయ రగడ ..పొలిటికల్ సర్కిల్ను ఇప్పుడు బాగా హీటెక్కిస్తోంది. అయితే ఈ రాజకీయ ప్రకంపనలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కారణంగా నిలిచారు.అయితే ఆయన అసహనం వెలుగులోకి వచ్చినా కూడా దానికి గల కారణమేమిటో కూడా ఇంకా ఎవరూ బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడలేదు.
అయితే అజిత్ పవార్ అసహనం విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హస్తినకు చేరుకుని హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో షిండే ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందనే ప్రశ్నలు జోరందుకున్నాయి. ఉద్ధవ్ ప్రభుత్వంలాగే షిండే ప్రభుత్వం కూడా కూలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు అజిత్ పవార్ అసంతృప్తి వార్తలపై ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే కౌంటర్లు వేశారు. మూడు నెలల హనీమూన్ కూడా ముగియలేదన్న సుప్రియా.. అప్పుడే సమస్యలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఇంజన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయిందని సుప్రియా చెప్పారు. దీనిలో ఒక శిబిరం కోపంగా ఉందని తాను విన్నానన్నారు. కోపంతో ఉన్న శిబిరం తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి తమతమ అసంతృప్తిని తెలియజేసినట్లు తాను విన్నానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయ్యాయన్న సుప్రియ..ఇంకా హనీమూన్ కూడా ముగియలేదు కానీ అప్పుడే సమస్యలు మొదలయ్యాయంటూ కౌంటర్ ఇచ్చారు. కేవలం మూడు నెలల్లోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయన్న ఆమె.. ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారని ప్రశ్నించారు.
ఇక అజిత్ పవార్ను గమనిస్తే.. ఆయన మూడ్ గత కొద్ది రోజులుగా మారినట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఆయన చేసిన ఒక ప్రకటన రాజకీయ వాతావరణంలో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. సెప్టెంబర్ 23న బారామతిలో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన అజిత్ పవార్.. తాను ఆర్థిక మంత్రిగా ఎంతకాలం ఉంటానో తనకు కూడా తెలియదంటూ బాంబు పేల్చారు. ఈ రోజు తనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంది.. కాబట్టే స్కీముల ప్రయోజనాలను అందిస్తున్నానని చెప్పుకొచ్చారు కానీ ఈ బాధ్యత ఎంతకాలం ఉంటుందో చెప్పలేనని అజిత్ పవార్ అనడం పెద్ద చర్చకే దారి తీసింది. దీనికి తోడు గణేష్ చతుర్థి కోసం లాల్బాగ్చా గణేష్ మండపానికి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లినప్పుడు.. అక్కడ ఎక్కడా కూడా అజిత్ పవార్ కనిపించలేదు. ఆ తర్వాత అమిత్ షా ..దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలతో సమావేశమైనా సరే దానికి కూడా అజిత్ పవార్ హాజరుకాలేదు.
మరోవైపు కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే గోప్చంద్ పదాల్కర్ అజిత్ పవార్పై చేసిన వ్యాఖ్య కూడా పెను సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. మహారాష్ట్రలోని ధంగర్ కమ్యూనిటీ సమస్యపై ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్లకు గోపీచంద్ పదాల్కర్ లెటర్ రాశారు. దీంతో ఈ విషయంపై.. అజిత్ పవార్కు ఎందుకు లెటర్ రాయలేదని మీడియా ప్రశ్నించినప్పుడు గోపీ చంద్ పదాల్కర్ చెప్పిన సమాధానం అప్పట్లో కాక రేపింది. అజిత్ పవార్ తెలివైన తోడేలు పిల్ల అని చెప్పిన పదాల్కర్.. అందుకే అజిత్ పవార్ను సంప్రదించాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. ఇలాంటి వరుస ఘటనలు మహారాష్ట్ర మహా రాజకీయాలను మరోసారి ఇరుకున పెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE