కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నేతృత్వంలో దేశంలో కోవిడ్-19 మీద మంత్రుల బృందం 18వ సమావేశం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. ప్రపంచ స్థాయిలో అత్యధికంగా ప్రభావితమైన మొదటి ఐదు దేశాల ప్రస్తుత స్థితితో భారత్ గణాంకాలు పోల్చి చూశారు. ఇందులో భారతదేశంలో ప్రతి పది లక్షలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 538 గా నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా ప్రతి పది లక్షలకు 15 చొప్పున అతి తక్కువగాను నమోదైనట్టు గుర్తించారు. అలాగే అంతర్జాతీయంగా ఆ కేసుల సంఖ్య 1453, మరణాల సంఖ్య 68.7 ఉన్నట్టు పేర్కొన్నారు.
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్) మొత్తం 90% కేసులు చికిత్సలో ఉన్నట్టు ఉన్నట్టు గుర్తించారు. అందులో కూడా కేవలం 49 జిల్లాల్లోనే 80% కేసులు చికిత్సలో ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా మొత్తం మరణాల సంఖ్యను పరిశీలిస్తే 86% మరణాలు ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్) లోనే సంభవించాయి. జిల్లాల పరంగా చూస్తే 32 జిల్లాల్లోనే 80% మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఎక్కువ మరణాలు నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక చర్యల ద్వారా మరణాల రేటు తగ్గించేలా కృషి జరుగుతున్నట్టు మంత్రుల బృందానికి అధికారులు తెలియజేశారు.
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, “మనం ముందుకెళ్ళేకొద్దీ, వ్యాధి నియంత్రణమీద ప్రత్యేకంగా దృష్టిపెట్టటం, నిఘా పెంచటం, పూర్తి స్థాయి పరీక్షల సామర్థ్యాన్ని వాడుకోవటం, వృద్ధులలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారిమీద ప్రత్యేకంగా గుర్తించడం, ఆరోగ్య సేతు లాంటి యాప్స్ సాయంతో రాబోయే హాట్ స్పాట్స్ ఏవో ముందుగా గుర్తించగలగటం, రోగులను చేర్చుకోవటంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటం, పడకలు, ఆక్సిజెన్, వెంటిలేటర్లు, ఇతర పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించటం మీదనే పనిచేస్తున్నామని” చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మరణాల రేటును వీలైనంత తక్కువ స్థాయిలో ఉంచటం, ఆరంభ దశలోనే బాధితులను గుర్తించటం. చికిత్స అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu