ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, 03, 07 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే మూడు దశల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, రేపు (ఫిబ్రవరి 23, బుధవారం) నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. లఖింపూర్ ఖేరీ, లక్నో, రాయ్ బరేలీ, సీతాపూర్, పిలిభిత్, హర్దోయ్, ఉన్నావ్, బందా, ఫతేపూర్ వంటి 9 జిల్లాల్లోని 59 స్థానాల్లో 624 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నాలుగో దశ పోలింగ్ కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
కాగా రేపు పోలింగ్ జరిగే స్థానాల్లో లఖింపూర్ ఖేరీ, ఉన్నావ్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన సందర్భంగా లఖింపూర్ ఖేరీలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. రేపు జరగబోయే ఎన్నికల్లో లఖింపూర్ ఖేరీ, ఉన్నావ్ జిల్లాల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారనే ఆసక్తి నాయకుల్లో, పార్టీల్లో నెలకుంది. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడం, దేశ రాజకీయాలపై ప్రభావితం దృష్ట్యా అందరి దృష్టి ప్రస్తుతం యూపీ ఎన్నికలపైనే ఉంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందా లేదా సమాజ్ వాదీ పార్టీ విజయం సాధిస్తుందా? కాంగ్రెస్, బీఎస్పీల ప్రభావమెంత ఉంటుందనే అంశాలపై రాజకీయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ